

Inter English Exam: ఇంటర్ విద్యార్ధులకు గుడ్న్యూస్, ఆ ప్రశ్నకు 4 పుల్ మార్కులు..!!
Inter English Exam: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ నుంచి విద్యార్ధులకు గుడ్న్యూస్ అందింది. మొన్న జరిగిన ఇంగ్లీషు పరీక్షలో అదనంగా 4 మార్కులు కలపనుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పరీక్షకు ఈ నాలుగు మార్కులు అదనంగా కలవనున్నాయి. తెలంగాణలో మార్చ్ 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. మొన్న మార్చ్ 10వ తేదీన ఇంగ్లీషు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో 7వ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించి విద్యార్ధులకు 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎందుకంటే ఇంగ్లీషు 7వ ప్రశ్న ముద్రణా లోపం కారణంగా సరిగ్గా కన్పించలేదు. పైన ఛార్టులో ఇచ్చిన శాతం స్పష్టంగా ఉన్నా పక్కన చిన్న బాక్సుల్లో ఇచ్చినవి సరిగ్గా కన్పించకపోవడంతో విద్యార్ధులు అయోమయానికి గురయ్యారు. ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తెలిసినంత వరకు రాయాలని సమాధానం చెప్పడంతో కొందరు రాసేందుకు ప్రయత్నించగా మరి కొందరు వదిలేశారు. ఈ సమస్యపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఛీఫ్ సూపరింటెండెంట్లకు విద్యార్ధులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చారు. చాలా చోట్ల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు దీనిని పరిశీలించింది. సంబంధిత సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఆ ప్రశ్నకు అంటే ఇంగ్లీషు పరీక్షలోని 7వ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించినవారందరికీ 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంగ్లీషు పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,33,963 మంది హాజరుకాగా, 13,029 మంది గైర్హాజరయ్యారు. మొత్తానికి ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులకు ఏకంగా 4 మార్కులు పడనున్నాయి. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంటర్ పరీక్ష విధానం, సిలబస్లో కీలక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నుంచి పరీక్షల్ని 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులు వివిధ కళాశాలల్లో ఇంటర్నల్ ప్రాజెక్టుల రూపంలో మార్కులు కేటాయిస్తారు. ఆర్ట్స్ విద్యార్ధులకు కూడా సంబంధిత ప్రాజెక్టులు ఉండే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎకనామిక్స్ చదివే విద్యార్ధులకు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ బడ్జెట్ ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. హిస్టరీ విద్యార్ధులయితే తమకు తెలిసిన లేదా సమీపంలోని ప్రాంతం చరిత్రపై అధ్యయనం చేసి రిపోర్ట్ సమర్పించాలి. ఇలా వివిధ గ్రూపు విద్యార్ధులకు వేర్వేరు ప్రాజెక్టు వర్క్స్ కేటాయిస్తారు. ఇవి 20 మార్కులకు ఉంటాయి. వీటిని రెగ్యులర్ మార్కులకు కలుపుతారు