

కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు కూడా అర్పించలేదు: తెలంగాణ సీఎం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 09 9- ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవిని సైతం త్యాగం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అఖిలభారత పద్మశాలి మహాసభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం కనీసం నివాళులు కూడా అర్పించకపోవడాన్ని పద్మశాలి సమాజం మరిచిపోలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే, ధృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయణ్ని ఖతం చేశారని విమర్శించారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసి, దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని అన్నారు. అలాగే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటించారు. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ. 600 కోట్ల విలువైన కోటి 30 లక్షల చీరల ఆర్డర్ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని, ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే, తమ లెక్కలో ఉన్నత కులాలు 15.28 శాతం మాత్రమే అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. కోటి రూపాయలతో షోలాపూర్లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని, ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం పద్మశాలీలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు