

రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే..
ఆదివారం దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ కూడా తమ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపడేశారు. ఈ మ్యాచ్తో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా వన్డేల నుంచి వైదొలుగుతాడని చాలా మంది అనుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా పది ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన వెంటనే కోహ్లీ వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. చివరి మ్యాచ్లో తన కోటా బౌలింగ్ పూర్తి చేయడంతోనే జడేజాను కోహ్లీ కౌగిలించుకున్నాడని చాలా మంది ఊహించారు. ఆ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలపై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. అనవసరపు రూమర్స్ వద్దు.. ధన్యవాదాలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా రిటైర్మెంట్ కూడా ఊహాగానమే అని క్లారిటీ వచ్చింది. జడేజా మరింత కాలం వన్డేల్లో కొనసాగుతాడని స్పష్టత వచ్చింది.
ధోనీ సారథ్యంలో 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాలో రవీంద్ర జడేజా కూడా సభ్యుడే. ఆ సీజన్లో జడేజా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ మ్యాచ్లో చక్కగా రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అలాగే విన్నింగ్ రన్స్ కూడా కొట్టి భారత్కు విజయాన్ని అందించాడు.