

ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు
ఆఖరాటకు అంతా సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వేల కోట్ల బెట్టింగ్ జరుగుతున్న ఈ మ్యాచ్ మీద ఎక్కడలేని బజ్ నెలకొంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్లోనూ అందరి ఫోకస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ల మీదే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే మరికొందరు కీలక ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఫైట్లో పక్కా చూడాల్సిన ప్లేయర్లు ఎవరు.. ఎవరి ఆట మిస్ అవ్వొద్దు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రేయస్ అయ్యర్
ఈ టోర్నమెంట్లో భారత్ తరఫున కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు అయ్యర్. 4 మ్యాచుల్లో అతడు 195 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో అతడు టీమిండియాకు వెన్నెముకలా వ్యవహరిస్తున్నాడు. అతడు ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే దాన్ని బట్టే భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
కేఎల్ రాహుల్
భారత టాప్-5 బ్యాటర్లలో రెండు రోల్స్ పోషింగల ఏకైక ఆటగాడు రాహుల్. అటు కీపింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ అతడు టీమ్కు చాలా కీలకం. స్టంపింగ్స్, క్యాచెస్, రనౌట్స్తో పాటు రివ్యూలు తీసుకోవడంలోనూ అతడి పాత్ర కీలకం. అదే సమయంలో ఎన్నో సవాళ్లతో కూడిన నంబర్ 6 పొజిషన్లో ఏ పరిస్థితులు ఎదురైనా నిలబడి మ్యాచ్ ఫినిష్ చేయడం రాహుల్ చేతుల్లోనే ఉంది.
వరుణ్ చక్రవర్తి
గ్రూప్ స్టేజ్లో కివీస్తో మ్యాచ్లో 5 వికెట్లతో రచ్చ రచ్చ చేశాడు వరుణ్. బౌలింగ్లో భారత్కు ఇతడే ట్రంప్ కార్డ్. ఈ మిస్టరీ బౌలర్ మిడిల్ ఓవర్లలో వరుసగా బ్రేక్ త్రూలు ఇస్తూ పోతే టీమిండియాకు తిరుగుండదు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి అతడు చెలరేగి బౌలింగ్ చేయడం ఖాయం.
రచిన్ రవీంద్ర
సొగసరి బ్యాటర్ రచిన్ మంచి ఫామ్లో ఉన్నాడు. భారత మూలాలు కలిగిన ఈ ఆల్రౌండర్ అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్, ఫీల్డింగ్తోనూ అభిమానుల్ని థ్రిల్ చేస్తుంటాడు. అతడి బ్యాటింగ్పై కివీస్ గంపెడాశలు పెట్టుకుంది.
మ్యాట్ హెన్రీ
హెన్రీ పేస్కు భారత బ్యాటర్లకు మధ్య ఇవాళ పెద్ద యుద్ధమే జరగనుంది. సూపర్ ఫామ్లో ఉన్న ఈ స్పీడ్స్టర్ చాంపియన్స్ ట్రోఫీలో 10 వికెట్లతో కాక రేపుతున్నాడు. ఇతడ్ని ఎదుర్కొని నిలబడితే పరుగుల వర్షం కురిపించొచ్చు.
మిచెల్ శాంట్నర్
భారత్కు అత్యంత ప్రమాదకారిగా శాంట్నర్ను చెప్పొచ్చు. మనతో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అతడు చెలరేగి బౌలింగ్ చేస్తాడు. పైగా ఇప్పుడు సారథిగా ఉన్నాడు కాబట్టి మరింత పట్టుదలతో ఆడతాడు. ఫ్యాన్స్ను ఎప్పటికప్పుడు తన పెర్ఫార్మెన్స్తో అలరించే ఈ ఆల్రౌండర్తో టీమిండియా కాచుకొని ఉండాలి..