

సమస్యంతా కిషన్ రెడ్డితోనే..
సీఎం సంచలన ఆరోపణలు..
ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆరే కారణం
వనపర్తి, మార్చి ౦౩: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆరే కారణం అని అన్నారు. పదేళ్లు పాలమూరు వలసల గురించి కేసీఆర్ ఆలోచించారా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని సీఎం నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. పాలమూరు ద్రోహి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తెలంగాణలో ఇచ్చింది రెండు ఉద్యోగాలేనని.. ఒకటి కిషన్ రెడ్డిది.. రెండోది బండి సంజయ్కి అని సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏడాది కాకుండానే తమను దిగిపోమ్మంటున్నారని.. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
వరంగల్ ఎయిర్పోర్టును తాతమే తెచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని.. ప్రాజెక్టు వస్తే మోదీ ఖాతాలోకి.. రాకపోతే రేవంత్ రెడ్డి ఖాతాలోనా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్లో వరద బాధితులకు కిషన్ రెడ్డి ఏం చేశారని సీఎం నిలదీశారు. తన కంటే చిన్నోడు రాష్ట్రానికి సీఎం కావడం కడుపు మంటగా ఉందా.. అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తన కాళ్లలో కట్టెలు పెట్టే పని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో మెట్రో, ఆర్ఆర్ఆర్ విస్తరణను అడ్డుకున్నది కిషన్ రేడ్డే అని మరోసారి ఆరోపించారు సీఎం. ఎంపీలందరితో కలిసి ప్రధాని మోదీ వద్దకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
‘కిషన్ రెడ్డి.. మీ దగ్గర మోదీ, ఈడీ, సీబీఐ ఉండొచ్చు. ఎంతకాలం దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరింపులకు పాల్పడుతారు. మేం భయపడం.’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తానే కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లానని.. రాష్ట్రానికి ఇవి కావాలని అడిగినట్లు సీఎం చెప్పారు. కిషన్ రెడ్డికి మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఓటు వేయలేదా అని సీఎం ప్రశ్నించారు. ‘పాపం ప్రధాని మోదీకి మనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. ప్రధాని మోదీకి చేయాలని ఉన్నా.. కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డు పడుతున్నారు.’ అంటూ కేంద్ర మంత్రిపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి తన రహస్య మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడనే బాధలో ఉన్నాడని.. తెలంగాణకు సమస్య మోదీతో కాదని.. కిషన్ రెడ్డితోనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్..