

ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను చాకచక్యంగా ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు కిచెన్లో కలియతిరిగాడు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో డేకే అరుణ ఇంట్లో లేరు. డీకే అరుణ ఇంటి వాచ్మ్యాన్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీల్లో దుండగుడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి సాయంతో విచారణ వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి ఆనవాళ్ల కోసం వెతికారు. దుండుగుడి కోసం అన్ని చోట్లా గాలిస్తున్నారు. అయితే, దుండగుడు గంటన్నర పాటు ఇంట్లో ఉన్నా ఏ వస్తువును దొంగలించలేదు. ఇదే పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇక, ఈ సంఘటనపై డీకే ఆరుణ స్పందించారు. తనపై ఏదైనా కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉందన్నారు. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. కాగా, ఈ మధ్య కాలంలో ప్రముఖుల నివాసాలకు భద్రత లేకుండా పోతోంది. కేవలం రాజకీయ నాయకులే కాదు.. సినిమా సెలెబ్రిటీల ఇళ్లలోకి కూడా దుండగులు చొరబడుతున్నారు. కొన్ని నెలల క్రితం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.