

Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్ జ్వరం కేసులు..!!
దవాఖానలకు భారీగా పోటెత్తుతున్న వ్యాధి బాధితులు
కలుషిత ఆహారం, పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తి
యాత్రలు చేసేవాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
బయట ఆహారం తినకపోవడమే మంచిది: వైద్యులు
Telangana | హైదరాబాద్,మార్చి 29 : రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలామందిలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నవారు కనిపిస్తున్నారు. అస్వస్థతతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. సాధారణంగా వాన, చలికాలాల్లో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. కానీ ఇప్పుడు ఎండాకాలంలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియాల కారణంగా ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా వైరల్ జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ప్రధానమైన దవాఖానలతో పాటు బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, ఏరియా దవాఖానలకు కోల్డ్ ఎలర్జీతో రోగుల తాకిడీ ఎక్కువయింది.
పొంచి ఉన్న కలరా ముప్పు?
వేసవిలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఆహార పదార్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండవు. ఉదయం వండిన ఆహార పదార్థాలు మధ్యాహ్నానికే పాడవుతాయి. ఆహారంలోని బ్యాక్టీరియా అధిక ఉష్ణోగ్రతలతో వేగంగా వృద్ధి చెందుతుంది. నిల్వ చేసిన, కలుషిత ఆహారం వల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఇ (కామెర్లు) తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వేసవిలో కలుషిత ఆహార పదార్థాలు, కలుషిత నీటి వల్ల కలరా బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో సరైన వైద్యం అందించకపోతే అది ప్రాణాలకే ప్రమాదకరం. అత్యధికంగా విరేచనాలు కావడం వల్ల శరీరంలో నుంచి నీరు, లవణాలు బయటకు పోవడంతో డీహైడ్రేషన్కు గురవుతారు. రోగిలో బీపీ పడిపోతుంది. కిడ్నీలు, గుండె పనితీరు దెబ్బతింటుంది. రోగులు ప్రాణపాయ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్తున్నారు.
కోల్డ్ ఎలర్జీకి కారణమయ్యే ఆహారాలు
కలుషితమైన చల్లని పానీయాలు
కలుషిత ఐస్క్యూబ్స్, ఐస్క్రీమ్స్, పళ్ల రసాలు, షర్బత్లు
ఫ్రిడ్జ్లో పెట్టి, తిరిగి వేడి చేసిన ఆహారం, నిల్వ ఉంచిన పదార్థాలు కోల్డ్ ఎలర్జీ లక్షణాలు
జలుబు, సుదీర్ఘకాలం దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు,
నీరసం, వాంతులు, విరేచనాలు, రైస్ వాటర్ స్టూల్(తెల్లటి విరేచనాలు).కలుషిత ఆహారంతో కోల్డ్ అలర్జీ వేసవి సెలవులు కావడంతో చాలామంది వివిధ యాత్రలకు వెళ్లి వస్తుంటారు. ఇలాంటి సమయంలో కొత్త ప్రాంతాల్లో ఆహారం పట్ల జాగ్రత్తలు అవసరం. కలుషిత ఆహారం, నీరు కారణంగా ఎలర్జీకి గురయ్యే ప్రమాదముంటుంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలతో దవాఖానకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. వారిలో ఇటీవల యాత్రలు చేసినవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వేసవిలో వైరస్ల ప్రభావం పెద్దగా ఉండదు. కానీ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. నిల్వ ఆహారాలు తీసుకున్నప్పుడు కలరా, టైఫాయిడ్ వ్యాధుల బారినపడే ప్రమాదముంది. ప్రజలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి