

Ration: రేషన్ కార్డు ఉన్నవారికి అతి భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పండగే..!!
Free Ration: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు._ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నెల నుంచి నెలకు ఆరు కేజీల సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని సుమారు 84 శాతం మంది ప్రజలు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. గతంలో రేషన్ ద్వారా అందజేసిన దొడ్డు బియ్యం (మోట బియ్యం) ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో, దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. కానీ సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రజల ఆహార భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రజలు స్వచ్ఛమైన, నాణ్యమైన బియ్యాన్ని తినే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు పోషకాహారం అందించేందుకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నీటి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కృష్ణా నదీ జలాల్లో కొంత మేర నీటి కొరత నెలకొన్నా, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నామని, ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి చేరుస్తామని తెలిపారు. ఈ చర్యల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి కొరత కొంతవరకు తగ్గుతుందని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. నిర్విఘ్నంగా తాగునీరు, సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం భూమి కూడా ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే బోర్లు ఆధారంగా సాగు చేసే రైతులకు మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోదని స్పష్టం చేశారు. ఈ ఎండాకాలంలో రైతులు ఎంత మేరకు వరి పంట వేయాలో అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టుల కింద సాగు నీరు నిరంతరాయంగా అందేలా ప్రభుత్వం ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తుందని, అవసరమైన చోట నీటి విడుదలకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల కష్టాలను ప్రభుత్వానికి తెలిసిన విషయమేనని, అందుకే సాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా పంటలు చివరి దశకు చేరిన ప్రాంతాల్లో నీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సన్న బియ్యం పంపిణీతో పాటు నీటి సరఫరా, వ్యవసాయానికి సాగునీటి అందుబాటు, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రజలకు తాగునీరు సరఫరా నిరంతరంగా ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాగునీటి కోసం చేపడుతున్న ప్రణాళికలు రైతులకు ఉపశమనం కలిగిస్తాయా? అన్నది మరికొన్ని రోజులలో తెలుస్తుంది. సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు అమలవుతుందో, ప్రజల మన్ననలను పొందుతుందో వేచిచూడాలి