

Minister Jupally Krishna Rao: తెలంగాణ గొప్పతనం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు – మంత్రి జూపల్లి
తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి… నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ వేదికగా మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు 72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు సంబంధించిన అందాల భామలు పాల్గొననున్నారు. ఈక్రమంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి అందాల భామలు వస్తారని తెలిపారు.తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది మంచి అవకాశమని మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు.