

Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఈ రెండింటికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్సంతకం చేశాక గెజిట్ విడుదల కానుంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలోని ఏ స్థానిక సంస్థలకూ పాలకవర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమయం వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఆ తరువాత సర్పంచ్, అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా వరుసగా మూడు రకాల ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని మోడీకి వినతిపత్రం..
బీసీ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసినందున, ఆయాపార్టీల ప్రతినిధులు వినతి మేరకు బీసీ బిల్లులకు ఆమోదం వస్తుందనే అంచనాలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్లవద్దని, కేంద్రానికి 2, 3 నెలల సమయం ఇచ్చాక.. అప్పటికీ కేంద్రం షెడ్యూల్-9లో చేర్చకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచించాలని ప్రభుత్వ పెద్దలుత చూస్తున్నారు.
ముగిసిన పాలకవర్గాలు..
గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఏడాది కావొస్తోంది. ఇక జెడ్పీ, మండల పరిషత్లకు 8 నెలలు కావొస్తుంది. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి రెండు నెలలు అయ్యింది. వీటితో పాటు సహకార సంఘాల పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడగించారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
బీసీ గణనతో మార్చిలో ఎన్నికలు మిస్..
అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి.కానీ, చివరి నిమిషంలో బీసీ గణనకు మరో సారి గడువు ఇవ్వడం, దానికి చట్టబద్ధత కల్పించడం కోసం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు బీసీ బిల్లుపై కేంద్రం స్పష్టత, మరోవైపు వేసవిలో తాగు, సాగునీరు , విద్యుత్ సమస్యలు సహజంగానే ఉండే అవకాశం ఉన్నది. అందుకే జూన్మధ్య నుంచి ఎన్నికల రిజర్వేషన్అధికారిక ప్రక్రియను ప్రారంభించడంతో జులైలో ఎన్నికలు జరుగుతాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్పటికల్లా వర్షాలు కురుస్తాయని, విద్యుత్, సాగు, తాగు నీటి సమస్యలు తీరుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇలా చేయడం వలన పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు.
నిధుల రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపేసింది. మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే పాలకవర్గం ఆమోదం తప్పనిసరి. అత్యవసరమైన పనులు మినహా మిగిలిన పనులు చేయడానికి అవకాశం లేదు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక సంస్థలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రత్యేక అధికారులు 2 రకాల విధులు నిర్వహించడం కష్టంగా మారిందని టాక్. అదే సమయంలో రాజకీయంగా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు గుర్తింపు ఇవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి వారికి అవకాశం కల్పించాలని అధికార పార్టీ చూస్తుంది. ఏ రిజర్వేషన్ కింద ఎవరిని బరిలో నిలబెట్టాలనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలవడానికి అధికార పార్టీ పూర్తిస్థాయి సన్నద్ధతో ఉన్నట్లు తెలుస్తోంది