

KCR | సింగిల్గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!
KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్గానే మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. ‘గోదావరి కన్నీటి గోస’ పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మసాగర్ వరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర నిర్వహించి.. ఇవాళ మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో కోరుకంటి చందర్ పాదయాత్ర బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయి. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని కేసీఆర్ సూచించారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు. ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి. తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది అని కేసీఆర్ ధ్వజమెత్తారు