

ASHA workers: సీఎం సార్.. మేం కూడా ఆడపిల్లలమే కదా! దద్దరిల్లిన హైదరాబాద్ కోఠి సెంటర్..!!
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు (ASHA workers) డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. చలో హైదరాబాద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కోఠిలోని డీఎంహెచ్ఓ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ సృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం జీతం రూ.18 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆడపిల్లలంటే సీఎంకు అభిమానం ఎక్కువ కదా.. మేం కూడా ఆడపిల్లలమే కదా సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించి పనిభారాన్ని తగ్గించాలంని ఆశా వర్కర్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు గౌరవం ఇదేనా? హరీశ్ రావు ఫైర్
రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా? అంటూ నిలదీశారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 15నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం, ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు