

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..
ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లాంటి నగరాల్లో ఎండలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ హైదరాబాద్ నగర వాసులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. వచ్చే రోజుల్లో ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం, సోమవారాల్లో ఎండలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాతి నాలుగు రోజులు అన్ని జల్లాలలో ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు ఉంటుందని పేర్కొంది. నిన్న నగరంలో అత్యధికంగా 39.6 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఆసిఫ్నగర్ ప్రజలు భారీ ఎండలకు అల్లాడిపోయారు. ఇక, గోల్కొండ, ముషీరాబాద్, చార్మీనార్, బహదూర్ పుర, బండ్లగూడ, అంబర్పేట, మారేడ్పల్లి, హిమాయత్ నగర్, షేక్ పేట్, ఖైరతాబాద్, సైదాబాద్లలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, తెలంగాణలోనే గరిష్ట ఉష్టోగ్రతలు కుమరం భీం, కరీంనగర్ జిల్లాలలో నమోదు అయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో శనివారం ఏకంగా 42.4 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.
హైదరాబాద్కు ఆరెంజ్ అలెర్ట్
ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు అదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక, ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జార్ఖండ్లోని దల్తోన్గంజ్ ప్రాంతంలో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఈస్ట్ సింగ్ భూమ్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు ఎక్కువగా ఉన్న, పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం పూట బయట తిరగటం మంచిది కాదని హెచ్చరించింది