

హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..
హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు భిన్న సంస్కృతుల్లో హోలీ జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా అక్రమార్కులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. హోలీ వేళ డ్రగ్స్ అమ్మేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ లోయర్ దూల్పేట్ మల్చిపురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా, ఆగ, మగ అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. ఇదే అదునుగా గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతికారు. ఈ మేరకు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి పెట్టి విక్రయాలు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ విక్రయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి పట్టుకున్నారు. నిందితుడి నుంచి గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్నూ సీజ్ చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నిందితుడు వాటిని తయారు చేసిన విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా, సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి తెలిపారు. సాధారణ సమయాలు, పండగల వేళ డ్రగ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని అంజిరెడ్టి సూచించారు.