

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం
సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం
మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసుకై పోటీ పడిన పలు రాష్ట్రాలు
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్కు ప్రస్తుతం తెలంగాణలో 38 అవుట్లెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో మూడు లేదా నాలుగు కొత్త అవుట్లెట్లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్లో నెలకొల్పనున్నారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 2 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సదరు సంస్థ ఛైర్మన్, సీఈఓ క్రిస్ కెంప్జెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వం తరపున సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు