

స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం : ఆశన్నగారి భుజంగ రెడ్డి*
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయాలి
షాద్నగర్ బస్టాండ్లో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం
ఎన్పీఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 08 : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డి) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశన్నగారి భుజంగరేడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జేర్కోని రాజు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను ముందుకు తీసుకురావడానికి మార్చి 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా షాద్నగర్ పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అశన్నగారి భుజంగ రేడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీను, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు జై స్వరాజ్ పార్టీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది (రాష్ట్ర జనాభాలో 12.02 శాతం) వికలాంగులున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12,769 గ్రామ పంచాయతీలు, 130 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 540 మండల పరిషత్లు, 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి, ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరారు.స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే, గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి, మండల ప్రజా పరిషత్ లలో 1,080 మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు (నామినేట్) ప్రతినిధ్యం కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేస్తామని ప్రకటించడం జరిగిందని అన్నారు. 2025 మార్చి 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు చేగురి శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్బే సంతోష్, మహిళ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.