

సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు
అమరావతి, మార్చి 5 :- ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలజీ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతి రావు, ఎస్టీయు విశాఖ జిల్లాకార్యదర్శి ఇ.పైడి రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎష్.సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సీపీఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్, గుంటూరు జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాశీ విశ్వేశ్వరరావు, తదితరులు ఉన్నారు.