

సామాజిక సేవకుడికి సమాజ్ విభూషణ్ పురస్కారం
మనోరంజని ప్రతినిధి – ముధోల్ ఫిబ్రవరి 28 మానవసేవే మాధవ సేవ అనే నానుడికి అక్షరాల నిజం చేసిన ఘనత గడ్డం సుభాష్ కు దక్కుతుంది. మండల కేంద్రమైన ముధోల్ చెందిన గడ్డం సుభాష్ మహారాష్ట్రలోని భోకర్ తాలూకా మాతుల్ లో సభాపతి శిరీష్ దేశము గోర్టేకర్- మాజీ సభాపతి బాలాసాహెబ్ చేతులమీదుగా సాహిత్య సమ్మేళన కార్యక్రమంలో సమాజ్ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తమ వంతు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, రక్తం అవసరం ఉంటే రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే విధంగా తన సొంత వాహనంలో 24 గంటల పాటు స్థానికులకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను సైతం కాపాడారు. సేవా కార్యక్రమాలను గుర్తించి స్థానికంగానే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో సైతం సన్మానించడం తమ ప్రాంత ప్రజల సన్మానమని పేర్కొన్నారు. మెడల్ తో పాటు సమాజ్ విభూషణ్ పురస్కార పత్రాన్ని అందించారు. గత నెల క్రితమే సమాజ్ భూషణ్ పురస్కారం సైతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా తనను ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులు, మిత్రులు, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. పురస్కారాన్ని తన తండ్రికి అంకితం చేస్తానని పేర్కొన్నారు. తాను బ్రతికున్నన్ని రోజులు నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. రెండు పర్యాయాలు సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం పట్ల మహారాష్ట్రలోని ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అవార్డు అందుకున్న సుభాష్ కు స్థానికులు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా అభినందించారు