

వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు..!!
హైదరాబాద్ నగరం కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపుతో ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థినుల సర్టిఫికేట్లపై అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. యూనివర్సిటీ ప్రారంభమై మూడేళ్లు పూర్తి కావస్తున్నా.. యూజీసీ గుర్తింపు రాకపోవడంతో డిగ్రీ పూర్తి చేయనున్న విద్యార్థినులకు ఉస్మానియా విద్యాలయంలో చదివినట్లుగా మార్కుల జాబితా వచ్చేది. ఈ క్రమంలో ఈ అంశాన్ని ఇంఛార్జీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అనంతరం యూనివర్సిటీ అధికారులు యూజీసీ అధికారులకు లేఖ రాయగా వివరాలన్నింటినీ పరిశీలించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్చి 26న (బుధవారం) గుర్తింపు పత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపించింది. మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించడంతో పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ చేసే అవకాశం లభించినట్లయింది. త్వరలో పీహెచ్డీ ప్రవేశాలకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, దూరవిద్యా విధానం, విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టాలంటే మాత్రం యూజీసీ అనుమతులు తప్పనిసరి. దీంతో న్యాక్ గుర్తింపు సాధ్యమైనంత వేగంగా పొందాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులు షరతులు పెట్టారు. తాజాగా, గుర్తింపు లభించడంతో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు