

వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రబి వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వరి కొనుగోలు ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియను చేపట్టే సిబ్బంది మొత్తం వరి కొనుగోలు ప్రక్రియ పై పూర్తి అవగాహనను కలిగి ఉండాలన్నారు. ఓపిఎంఎస్ యాప్ తో పాటు, జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియలను సులభతరం చేసేందుకై ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్ పై, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టెంట్ త్రాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. సరిపడినన్ని గన్నీ బస్తాలు, టార్పాలిన్లు, తూకపు యంత్రాలు, తేమయంత్రాలు, తదితర పరికరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం వేణుగోపాల్, డిసిఒ పాపయ్య, ఇన్ ఛార్జ్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
