

రైతు ఉద్యమ నేత దల్లేవాల్ దీక్ష విరమణ..!!
న్యూఢిల్లీ : రైతు ఉద్యమ నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ 132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంటలకు కనీస మద్దతు ధర పై చట్టబద్ధ హామీతో పాటు ఇతర కీలక డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ దీక్ష సాగింది. గతేడాది నవంబర్ 26న దల్లేవాల్ ఈ దీక్ష ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, రైల్వేశాఖ సహాయ మంత్రి రణ్వీత్సింగ్ బిట్టు ఆయనను దీక్ష విరమించుకోవాలని కోరిన మరుసటి రోజు, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్లో జరిగిన ‘కిసాన్ మహా పంచాయత్’లో దీక్షను విరమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాన్ని నిశ్శబ్దంగా, శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లినందుకు అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని శివరాజ్సింగ్, రణ్వీత్సింగ్ కోరిన నేపథ్యంలో దీక్ష విరమిస్తున్నానని ఆయన ప్రకటించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రధానంగా కనీస మద్దతు ధర చట్ట బద్ధం చేస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో ఏర్పాటైన వేదికలో దల్లేవాల్ కీలక నేతగా ఉన్నారు. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దీర్ఘకాలం పాటు పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వం జనవరిలో చర్చల కోసం రైతులను ఆహ్వానించగా, దల్లేవాల్ తాను దీక్ష చేస్తున్న స్థలంలోనే వైద్య సాయం పొందేందుకు అంగీకరించారు. అయినా ఆయన తన నిరాహార దీక్షను కొనసాగిస్తూవచ్చారు.
మే 4 న సమావేశం : శివరాజ్సింగ్ చౌహాన్ ట్వీట్
రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చర్చలు జరుపుతుందని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ట్వీట్ ద్వారా తెలిపారు. మే 4న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ప్రకటించారు. అంతేగాక, దల్లేవాల్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 132 రోజులపాటు కొనసాగిన దీక్షకు ముగింపు పలికిన దల్లేవాల్ ధైర్యం, పట్టుదల దేశవ్యాప్తంగా రైతుల్లో కొత్త ఉద్వేగం కలిగించింది