

రాష్ట్ర బడ్జెట్ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.
గొప్పలకు పోకుండా ఉన్నంతలో బడ్జెట్ పెట్టారు.
కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాకుంటే రాష్ట్రాన్ని నడపడం కష్టమే.
బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు.
— సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.
భారీ రుణ భారం, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల మధ్య ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు సాహసోపేతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ తీపి, చేదు కలగొలుపు ఉగాది పచ్చడిలాగా ఉన్నది. సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలు పట్ల సమతుల్యత కోసం ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపించింది. గొప్పలకు పోయి బడ్జెట్ను పెంచకుండా, పన్నుల భారం మోపుకుండా, ఉన్నంతలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలి పూర్తి స్థాయి బడ్జెట్ తరువాత అనుభవంతో వాస్తవికంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం పథకాలకు లక్ష కోట్లు ఉండగా అందులో ఆరు వాగ్దానాలకు అమలుకు 56 వేల కోట్లు సహా, సంక్షేమ పథకాలకు రూ.1.04 లక్షల కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వారసత్వంగా వచ్చిన అప్పులతో పాటు, తిరిగి చెల్లించేందుకు చేస్తున్న అప్పులు , బడ్జెటేతర రుణాలు కలిపి అప్పులు రూ.8లక్షల కోట్లకు చేరుకోవడం, జిఎస్డిపిలో రుణ నిష్పత్తి పరిమితి మించి 28.1 చేరడం కొంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ద్వారా ఆర్థిక వనరులను కేంద్రీకృతం చేసిన ప్రభావం రాష్ట్ర బడ్జెట్లపై పడుతున్నది. నిధుల సమీకరణకు భూముల విక్రయం, మద్యం ద్వారా సుమారు రూ.60 వేల కోట్లు సమీకరించాలని భావించడం సమంజసం కాదు. నీటిపారుదలకు రజూ23,354 కోట్లు మాత్రమే కేటాయించారని ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలంటే ఇంకా ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి రూ.2900 కోట్లు మాత్రమే కేటాయించారని వాస్తవానికి రూ.11,600 పెట్టాలని, వైద్యరంగానికి 4.5శాతం మాత్రమే కేటాయింపులు చేశారు. , విద్యారంగానికి 7.5 శాతం మాత్రమే కేటాయించారు. ఇంకా పెంచాల్సి ఉంది. కనీస బడ్జెట్ విద్యా, వైద్యరంగాలకు ఇంకా 20 శాతం వరకు కేటాయింపులు చేయవచ్చు. జర్నలిస్టులకు పని భద్రత లేదని, ప్రతి వర్గానికి ఆర్థికంగా, ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించాలని అన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, వేతనాల పెంపుదల ప్రస్తావన లేదని అన్నారు. ఉన్నంతవరకు ఇది మంచి బడ్జెట్ అని, ఈ స్థితిలో ఇంతకంటే సాధ్యం కాదని సాంబశివరావు తెలిపారు.