

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో
అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్
మనోరంజని ప్రతినిధి:- నిర్మల్ ఫిబ్రవరి28 :-రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ముస్లిం సోదరులు ఉపవాసం ఉండే సమయాల్లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ముస్లిం మత పెద్దలతో ఎస్పీ జానకి షర్మిల తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 2 నుంచి రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, మసీదుల పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలి సూచించార. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దుకాణ సముదాయాలను అదనపు సమయాల్లో తెరిచి ఉండే విధంగా అనుమతించడం జరుగుతుందన్నారు. ముస్లింల సహాయార్థం టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు త్వరితగతిన స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రంజాన్ పండుగనాడు అన్ని ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈద్గాలలో త్రాగునీరు, షామియానాలు, ఇతర ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఈద్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని మతాల పండుగలను సహోదర భావంతో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలను అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేష్ కుమార్, ముస్లిం మత పెద్దలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

