

మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..
న్యాయం చేయాలంటూ బాలిక బంధువుల ఆరోపణ..
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్
పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన బాలిక
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ కు చెందిన మైనర్ (17) బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన 27 సంవత్సరాల యువకుడు ముల్లంగి జమలయ్య పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన చేశారు
దీంతో ఈనెల 21న తాము ఎర్రుపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, 22వ తేదీన ఖమ్మంలో సీపీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఆదివారం గ్రామస్తులతో కలిసి మళ్లీ పోలీస్స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాలిక స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది.
బాధితురాలి బంధువులు మాట్లాడుతూ.. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ముల్లంగి జమలయ్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలి ఫిర్యాదును స్థానిక ఎస్సై పి.వెంకటేష్ తీసుకోకుండా నిరాకరించారని బాధితురాలు బంధువులు చెప్పారు. తాము శనివారం ఖమ్మం కమిషనర్ కి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశామన్నారు.
అయినా సరే యువకుడికి తమ గ్రామానికే చెందిన మాజీ ప్రజా ప్రతినిధి, ఐపీఎస్, సీఐ స్థాయి పెద్ద మనుషుల అండ ఉండటంతో నిందితుడు అంగన్ వాడీ, పాఠశాల రికార్డులలో జనన తేదీని మార్పిడి చేసి నకిలీ సర్టిఫికెట్ ను సృష్టించి కేసు ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తూ తాత్సారం చేస్తున్నారని బాలిక, గ్రామస్తులు ఆరోపించారు.
అంతే కాకుండా తమ ఫిర్యాదును తీసుకోకుండానే ముందుగా కేసును తారుమారు చేసే విధంగా నకిలీ ఆధారాలు తయారు చేసేందుకు ప్రయత్నించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కేసు నమోదు చేసేందుకు ఎంతకీ ఎస్సై స్పందించకపోవడంతో మైనర్ బాలిక పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయింది.
వెంటనే స్పందించిన బాలిక అన్నయ్య, పోలీసులు బాలికను ట్యాంక్ నుంచి దింపి కాపాడారు. భీమవరం గ్రామస్తులు బాలికతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేసు నమోదు చేస్తానని ఎస్సై హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.