

ముజ్గి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 27 ;- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం ముజ్గి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ హాజరు, ఇన్ పెషేంట్ వార్డు, ఆయుష్ క్లినిక్, డ్రగ్స్ స్టోరూం లను సందర్శించి, రిజిస్టర్లను పరిశీలించారు. అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు లభిస్తున్న సదుపాయాలపై వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని, ఆసుపత్రుల్లో సరిపడినన్ని బెడ్లు, మందులు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. అందిస్తున్న వైద్యచికిత్సలు, మందులను రోజువారీగా రిజిస్టర్ లలో నమోదు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలనను పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రిలో నిరంతరం పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలోని సౌకర్యాలు, అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాజేందర్, వైద్యశాఖ అధికారులు శ్రీనివాస్, రవీందర్, తహసీల్దార్ సంతోష్, ఎంపిడిఓ గజానంద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
