

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు
సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు… ఏఐలోనూ రాణించాలి
-మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి 7 :- మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. న్యూ జెనరేషన్ – టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ – ప్రోస్పెరిటీ ఫర్ ఆల్” అనే అంశంపై విజయవాడలోని నోవోటెల్ హోటల్ జరిగిన అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని వివరించారు.
మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు
ప్రస్తుతం మహిళలు సంపాదనలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యమని వివరించారు. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని అన్నారు. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళా పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాను. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గిస్తున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను దాదాపు 45 శాతం మహిళలే నడిపిస్తున్నారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారని, అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. దీని కోసం ప్రభుత్వం ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటుందని వివరించారు.
ఇన్నోవేషన్ హబ్ల ద్వారా మద్దతు
రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను అన్ని రకాలుగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఈ విషయం తాను ఇప్పుడు మాట్లాడటం కాదు… రాబోయే రోజుల్లో ఫలితాలను కూడా చూపిస్తానని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామని అన్నారు.
ఏఐలోనూ మహిళలు రాణించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కూడా ఏఐలో రాణించాలి. భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్దే. మీరు ఆఫీసులో పని చేసి ఇంటికి వెళ్లేముందుగా ప్రోగ్రామ్ చేసుకుని ఇంటికి చేరుకునే సమయానికి ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవచ్చు. నూతన ఆవిష్కరణలే మన జీవితాలను మార్చుతాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డ్రాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో విజన్ను రూపొందించాం. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
డిజిటల్ అక్షరాస్యత అవసరం
నిరంతర అభ్యాసం ప్రతి ఒక్కరికీ అవసరం. అభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ, తద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందగలం. ప్రపంచం వేగంగా మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను పొందాలంటే డిజిటల్ అక్షరాస్యత తప్పకుండా అవసరం. పౌరులు టెక్నాలజీతో పాటు సెల్ఫోన్లను కూడా విరివిగా వినియోగించాలి. ప్రస్తుత కాలంలో భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య జీవించగలుగుతున్నారు కానీ సెల్ఫోన్ లేకుండా ఏ ఒక్కరూ ఉండలేకపోతున్నారు. మహిళలు పని, గృహ బాధ్యతలను సమర్ధవంతంగా సమతుల్యం చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకురాబోతున్నాం. మహిళలు నూతన ఆవిష్కరణలను తీసుకురావాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. అవకాశాలను అంచనా వేసుకుని, రాష్ట్ర పురోగతికి సమిష్టిగా పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. కార్యాచరణ, ఆవిష్కరణల ద్వారా ఏపీని ఎంట్రప్రెన్యూర్లకు కేంద్రంగా మార్చేందుకు కృషి చేసి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేందుకు అందరం పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు.