

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..
కారు స్వాధీనం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్ఓ పాండునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.