

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై మండలిలో మరోసారి వాగ్వాదం..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై మండలిలో గురువారం కూడా చర్చ జరిగింది. బుధవారం జరిగిన చర్చకు కొనసాగింపుగా బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడారు.
ఫీజుల విషయంలో తీన్మార్ మల్లన్న తన పేరును ప్రస్తావించడంతోపాటు అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటున్నారని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ చైర్మన్ మనుమడి అడ్మిషన్ కోసం ఓ ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్తే రూ.3 లక్షలు అడిగారని సభలో స్వయంగా ఆయనే చెప్పారని ఏవీఎన్ రెడ్డి గుర్తు చేశారు. జీవో ఎంఎస్ నంబర్ 1 ప్రకారమే తమ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కలుగజేసుకుంటూ.. తన మాటలను రికార్డుల నుంచి తొలగించారని, మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. సభ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతుండడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ‘యాక్షన్ తీసుకుంటే తీసుకోండి ఇబ్బంది లేదు’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
ఆగాఖాన్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించిందని ఏవీఎన్ రెడ్డి తెలిపారు. తమ సొంత భవనాల్లోనే తాము విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల స్పౌజ్ ట్రాన్స్ఫర్ల అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ కోదండరాం సభ దృష్టికి తెచ్చారు. కుటుంబాలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండాల్సి వస్తున్నదని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న నాటి నుంచీ సమస్య అలాగే ఉందన్నారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.