

నిర్మల్లో ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించింది. శనివారం మేడిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రైవేటు స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రాజెక్టు కింద నిర్మల్ జిల్లాలో 16 పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా AI ఆధారిత యాప్లు, ప్లాట్ఫామ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్లు విద్యార్థుల అభ్యాస స్థాయిని గుర్తించి వారికి అవసరమైన పాటలను, కథలు, వీడియోలు, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని అందిస్తాయి.
కలెక్టర్ అభిలాష అభినవ్ ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థి ఆరోగ్య, విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్, లింబాద్రి, ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు


