

డీలిమిటేషన్ తో దక్షిణాది భవిష్యత్తుకు పెను ప్రమాదం: దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కేటీఆర్ ఆందోళన
దశాబ్దాల నుంచి దక్షిణాదిపై కొనసాగుతున్న వివక్ష: కేంద్రం వైఖరిపై కేటీఆర్ విమర్శ
ప్రస్తుత డీలిమినేషన్ విధానానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిన కేటీఆర్
పార్లమెంట్ స్థానాలు యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే సీట్లు పెంచాలి
ఆయా రాష్ట్రాలు సాధించిన ఆర్థిక ప్రగతి, పరిపాలన విధానాలు, అభివృద్ధి ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి.
ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారకూడదు
దక్షిణాదికి శిక్ష కాదు, ప్రోత్సాహం కావాలి
దక్షిణాది హక్కుల కోసం పోరాడకపోతే చరిత్ర క్షమించదు
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలతో చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ ప్రసంగం
చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని అద్భుతంగా వివరించారు. ఈ విధానం కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిధుల కేంద్రీకరణతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని, దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు.భారతదేశం ప్రజాస్వామిక దేశమైనప్పటికీ, భిన్న అస్తిత్వాలు, సంస్కృతులతో కూడిన సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి దశాబ్దాలుగా వివక్షను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రతిపాదనలతో పార్లమెంట్ ప్రాతినిధ్యంతో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలు, ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, తన ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియతో కలిగే నష్టాలను వివరించిన ఆయన, దక్షిణాది ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ పద్ధతులపై భారత రాష్ట్ర సమితి తరఫున పలు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాతినిధ్యాన్ని, ప్రభుత్వాలతో సంబంధాలను పెంపొందించి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేపడుతున్నట్లయితే, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ఈ విధానానికి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి తరఫున కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ఆధారంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచితే పరిపాలన ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని, అందుకే పార్లమెంట్ స్థానాలను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని ఆయన సూచించారు. లేదంటే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం లేదా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సీట్ల విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాల పాటు జనాభా ఆధారంగా సీట్ల పెంపును నిలిపివేసి, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించిన తర్వాత అదే సూత్రం ఆధారంగా డీలిమిటేషన్ చేయడం అన్యాయమన్నారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో 36% సహకారం అందిస్తున్నప్పటికీ, కేవలం 19% జనాభా కలిగి ఉన్నాయని, అందువల్ల పార్లమెంట్లో 36% ప్రాతినిధ్యం ఇవ్వాలని విప్లవాత్మక సూచన చేశారు. జనాభాతో పాటు ఆర్థిక, పరిపాలన అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే పనులు చేయాలని, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని, దేశం సూపర్ పవర్గా మారాలంటే ఈ బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అనేక నష్టాలు కలుగుతాయని కేటీఆర్ హెచ్చరించారు. దేశ అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతుండగా, వెనుకబడిన రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని ఆయన విమర్శించారు. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, ఈ విధానంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని, 36% జీడీపీ సహకారం అందిస్తున్న ఈ రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, అయితే మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అన్యాయం మరింత పెరిగిందన్నారు కేటీఆర్. ప్రస్తుత బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తెచ్చి ఈ వివక్షను మరింత తీవ్రతరం చేస్తోందని ఆయన విమర్శించారు. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమవడం ఇందుకు ఉదాహరణ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి దక్షిణాది రాష్ట్రాల గాయాలపై కేంద్రం ఉప్పు చల్లినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ తో కేవలం పార్లమెంట్ లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గడానికే పరిమితం కాదని, ఆర్థిక నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియతో అధికారం కేంద్రీకృతమై, నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని, కేవలం నాలుగైదు రాష్ట్రాలు దేశ భవిష్యత్తును నిర్దేశించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక వనరుల కేంద్రీకరణతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపుల అన్యాయం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. “సమాఖ్యత కేంద్రం ఇచ్చేది కాదు, రాష్ట్రాల హక్కు. అందుకే మా ప్రయోజనాల కోసం పోరాడుతాం,” అని ఆయన స్పష్టం చేశారు. “మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవకూడదు. ఇది నియంతృత్వానికి దారితీయకూడదు,” అని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని, జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “మనమంతా భారతీయులం. అయితే, ఆయా ప్రాంతాల అస్తిత్వాన్ని, విభిన్న భాషలు, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన సమైక్య దేశమన్న విషయాన్ని మర్చిపోకూడదు,” అని కేటీఆర్ అన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ నిధుల కేటాయింపుల్లో వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 1971 తర్వాత జనాభా నియంత్రణ చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు ఈ రోజు నష్టపోవడం అన్యాయమని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందున వాటికి లబ్ధి చేకూర్చడం సరికాదని, ఇది దేశాన్ని వెనుకకు నడిపిన వారికి బహుమతి ఇవ్వడమేనని విమర్శించారు. “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి సూపర్ పవర్ కావాలంటే, అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి, శిక్ష కాదు,” అని కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ ఆర్థిక, పరిపాలన, అభివృద్ధి ఆధారంగా జరగాలని, కేవలం జనాభా ఆధారంగా మాత్రమే కాకూడదని ఆయన డిమాండ్ చేశారు.
“ఈ అంశంలో జరుగుతున్న నష్టంపై మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్ తరాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయి,” అని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ తన ప్రసంగంలో కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు నడిచిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, మెజారిటీ నియంతృత్వంతో కలిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. ఢిల్లీలోని మందబలాన్ని ఓ వైపు ఎదురిస్తూనే మరోవైపు సమైక్య రాష్ట్రంలోని మెజారిటీ నాయకత్వంపై పోరాటం చేసి తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి 14 సంవత్సరాలు పట్టిందన్నారు. తమిళనాడు ప్రజల నుంచి అస్తిత్వం, హక్కుల కోసం పోరాడే స్ఫూర్తిని తీసుకుంటామని, ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో రాష్ట్రాల హక్కుల సాధనకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు కేటీఆర్. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీలను నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రయోజనాల కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయకపోగా, జమ్మూ కాశ్మీర్లో మాత్రం అమలు చేసిందని విమర్శించారు. బీజేపీ వంటి పార్టీలు ఈ సమావేశాన్ని దేశ వ్యతిరేకంగా చూపే ప్రయత్నం చేసినా, “మేమంతా భారతీయులం, దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం,” అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సమావేశం తర్వాత ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల పార్టీలు, నేతలు కలిసి ప్రస్తుత డీలిమిటేషన్ విధానంపై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

