

ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..
మనోరంజని ప్రతినిధి మార్చి 07
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా గడువు ముగిసాక కూడా అమెరికాలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా పని చేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లు సమయం ఇస్తారు. ఆలోపు కొత్త వీసా తీసుకోవాలి.
డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చినట్లు అమెరికా వర్గాలు చెప్తున్నాయి. వీసా గడువు ముగుస్తున్న వారికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ట్రంప్ చెప్తున్నట్లు అమెరికాను వీడి వెళ్లక తప్పదా అన్న ఆందోళన నెలకొంది. వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాని ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు అవుతారు. దీని వల్ల భవిష్యత్తులో స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వారంతా ఈ స్టూడెంట్ వీసా తీసుకోలేక.. గడువు ముగిశాకా ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు.