

ఛాంపియన్ టీమిండియా.. చరిత్ర సృష్టించిన టీమిండియా..
టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది (Ind vs Nz). రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (83 బంతుల్లో 76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఛేజింగ్ను సులభం చేశాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29), కేఎల్ రాహుల్ (34) రాణించడంతో టీమిండియా టార్గెట్ను ఛేదించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్మన్ గిల్ (31)తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 105 పరుగులు జోడించాడు. టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంట్నర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (1)ని బ్రేస్వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్.. రచిన్ బౌలింగ్లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత అయ్యర్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా (18) అవుటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (34) లాంఛనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, బ్రేస్వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (63), బ్రేస్వెల్ (53), రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) కీలక పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు

