చెరువుల సంరక్షణపై నిర్లక్ష్యం ఎందుకు…?
అధికారుల తీరుపై ప్రజల అసంతృప్తి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచడంతోపాటు ఆయకట్టు సాగు కొరకు గతంలో చెరువులను ఏర్పాటు చేసింది. రాను రాను పంట పొలాల్లో బోర్లు రైతులు అధికంగా వేసుకోవడంతో చెరువుల నుండి నీటి అవసరం తగ్గింది. గతంలో ఎండాకాలం వచ్చే సమయానికి చెరువులోని నీళ్లు ఎండిపోయేవి. అయితే ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న చెరువుల్లో అనుమతి లేకుండా త్రవ్వకాలు జరపడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సైతం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు ప్రధాన జీవనాధారమైన చెరువుల పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతుంది. ప్రభుత్వం చెరువుల మరమ్మత్తుల కొరకు నిధులు సైతం విడుదల చేస్తుంది. అయితే అధికారులు మాత్రం చెరువుల సౌరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన అంతంత మాత్రంగానే పరిష్కారం అవుతున్నాయని వాపోతున్నారు. చెరువుల్లో అక్రమ తవ్వకాలను అరికట్టడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ని చెరువుల సంరక్షణకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకునే విధంగా జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు