

గవర్నర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు
రాజ్భవన్లో వేడుకలు.. పాల్గొన్న సీఎస్, డీజీపీ
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో శనివారమే ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఓ ప్రకటనలో అభిలషించారు.. ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది మరింత సమర్థంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తుందని వెల్లడించారు.
రైతులు వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ అఽధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మరో ప్రకటనలో ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పంచాగ శ్రవణం ఉంటుందని.. మహేశ్ గౌడ్తో పాటు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి