గంట ముందే అసెంబ్లీకి కేసీఆర్: ఆసక్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పరామర్శ..!!
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బుధవారం (మార్చి 12) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెషన్లో పాల్గొనేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
హైదరాబాద్లోని నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు అసెంబ్లీ ప్రాంగణం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. బుధవారం (మార్చి 12) మాత్రం సెషన్ ప్రారంభానికి గంట ముందే అంటే ఉదయం 10 గంటలకే అసెంబ్లీకి రావడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రాలేదు. మళ్లీ బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు.
అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీసులో ఉన్న కేసీఆర్ ను.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవటం ఆసక్తిగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి.. తన తమ్ముడి పెళ్లికార్డును స్వయంగా కేసీఆర్ కు అందజేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా కేసీఆర్ ను కలిశారు. దీనిపై ఆయనే స్పందించారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లే కావటం విశేషం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి.. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు.