కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 11: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీకి హస్తం నేతలు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎంకు వేతనం నిలిపివేయాలంటూ కాంగ్రెస్ లీడర్లు కోరారు. అలాగే ఇన్ని రోజులు కేసీఆర్కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి ఆయనకు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని.. అందువల్ల ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని హస్తం నేతలు లేఖలో కోరారు. ప్రజల సొమ్మును కేసీఆర్ జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో వేతనాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆడబిడ్డల జోలికొచ్చారో..
ఇక ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను కించపరిచే అవకాశం ఉందని, హేళన చేసే ఛాన్స్ ఉంది కాబట్టే ఆయన అసెంబ్లీకి రావడం లేదని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ర్యాగింగ్ చేస్తారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు పదే పదే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల మాట. దీనిపై హస్తం నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా ఆయనను ర్యాగింగ్ చేసే అవకాశం లేదని.. ప్రతిపక్ష నేతగా, పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తామని తెలిపారు. అలాగే కేసీఆర్ ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. దీన్ని పరిశీలించాల్సిందిగా అసెంబ్లీ సెక్రటరీకి రికమెండ్ చేస్తూ స్పీకర్కు లేఖను పంపించారు.