

కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”
ఆదాయ దృవపత్రాల జారీకి ఎందుకంత సమయం..!?
ఫరూక్ నగర్ తహాసిల్దార్ పార్థసారధిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శంకర్
సాంకేతిక లోపాలు తలెత్తాయని తహసిల్దార్ పార్థసారధి సమాధానం
యువతకు సకాలంలో ప్రభుత్వ ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశాలు
సాంకేతిక లోపాలపై కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
రెవిన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే యువత వార్షిక ఆదాయం, కుల తదితర దృవపత్రాల జారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. శనివారం ఫరూక్ నగర్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి వేలాదిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయ ధ్రువపత్రాలు, కుల తదితర సర్టిఫికెట్లను పొందడానికి కార్యాలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాల జారీకి చాలా సమయం పడుతుందని, తమకు నిర్లక్ష్యం జరుగుతుందని యువత కొందరు ఎమ్మెల్యే కార్యాలయానికి మొరపెట్టుకోగా దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అసలు కార్యాలయంలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందన్న విషయాలను స్వయంగా తెలుసుకోవడానికి “కార్యాలయానికి కదలి వచ్చారు”. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ పార్థసారధిని ఏం జరుగుతుందని? ప్రశ్నించారు. ధ్రువ పత్రాల జారీ ప్రక్రియలో ఎందుకు ఆలస్యం? జరుగుతుందని సిబ్బందిని ప్రశ్నించారు. వారం రోజుల్లో దాదాపు 1249 దరఖాస్తులు వార్షిక ఆదాయం ఇతర దృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అయితే వీటిని వేగవంతంగా ఇచ్చేందుకు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఎమ్మెల్యేకు సూచించారు. అయితే సాంకేతిక లోపాలతో సర్వర్ డౌన్ అవుతుండడంతో ధృవ పత్రాల జారీకి కొంత జాప్యం జరుగుతుందని అధికారి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ లో మాట్లాడారు. రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం చేపడుతుందని యువత ఎందరో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి ధ్రువ పత్రాల కోసం కార్యాలయానికి వస్తున్నారని సాంకేతిక లోపాలను సవరించి వెంటనే యువత దరఖాస్తు చేసుకునే అంశాలపై దృష్టి పెట్టిందని వారికి తగిన సమయంలో సర్టిఫికెట్లను అందజేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు. దీంతో కలెక్టర్ సాంకేతికంగా ఏర్పడిన సమస్యలను వెంటనే అధిగమించి అన్ని కార్యాలయాల్లో యువతకు సకాలంలో సర్టిఫికెట్లు అందజేసే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆలస్యం జరగొద్దు – ఎమ్మెల్యే శంకర్ ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వన్ టైం సెటిల్మెంట్ తరహా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుందని ఈ పథకం వస్తే యువకులు లైఫ్ లో బాగా సెటిల్ అవుతారని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. అందుకే యువత వీటిని పొందడానికి ప్రభుత్వ నిబంధనలను పాటించడానికి సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, ఈ సమస్య తెలిసి స్వయంగా తానే పరిశీలించడానికి వచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించి వెంటనే అందరికీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన 1249 కి పైగా వచ్చిన దరఖాస్తులను వెంటనే విడుదల చేసే విధంగా చొరవ చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సయ్యద్ ఖదీర్, డాకం మనీష్, సోలిపూర్ అనిల్, గంగమౌని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
