ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

🥭తెలుగు సంవత్సరాది ఉగాది. జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం. కష్టాల వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం. ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్లీ చిగురు తొడుగుతుందనే ధీమా, నవ జీవితానికదే నాంది, మరెన్నో ఉగాదులకు పునాది.

🥭చైత్ర మాసంలో ప్రకృతి సప్త వర్ణ శోభితం ఆవుతుంది. మోడువారిన తరువులు చిగురాకుల చీరలు చుట్టి హొయలుపోతాయి. అందాకా మూగబోయిన కోకిల గొంతు సవరించుకుని కిలకిలరావాలు పలికిస్తుంది. పల్లవాలు సోయగాలు. పోతే మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి. ఎటు చూసినా ఆనందాలు ఆహ్లాదాలతో హృద్యంగా ఉంటుంది. చైత్ర మాసాన్ని మధుమాసంగాను పిలుచు కుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేది ఆంతర్యం.

🥭పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ. అబ్బాదౌ నింబకుసుమం శర్కరామఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తు తద్వర్షే సౌఖ్యదాయకం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దశభక్షణం.

🥭ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయడం శ్రేష్ఠం. వెండి, రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు. అందులో గంధం, పూలు, అక్షతలు, మామిడి, వేప, మోదుగ, నేరేడు, అశోక తదితర పత్రాల చిగుళ్లు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడికి గానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు.

🥭చైత్రే మాసి జగద్భహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రం తు తదా సూర్యోదయే సతి

🥭శ్రీమహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అంద జేశాడు. ఆ శుభదినమే ఉగాది అనే కథనము ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా వేడుక చేసుకునే ఆచారం ఉంది.

🥭ఉగాది నాడు ఏం చెయ్యాలి?

🥭ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమైన ఆ ప్రసాదం సేవించడం తోపాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులున్నాయి.

🥭నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహధ్వజారోహణం నింబ పత్రాశనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభః

🥭నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటు కాలక్షేపం చెయ్యాలి. ద్వారాలను తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిశ్రితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు. ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిరచిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది. దాన్ని ఆరగించేముందు.

🥭శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అనే శ్లోకం పఠించాలి.

🥭ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం, దీర్ఘాయుష్షు లభిస్తాయన్నారు మహర్షులు.

🥭తిథిప్రోక్తం మను బ్రహ్మ వారస్య మయసంభవం నక్షత్రం త్వష్ట రూపంచ శిల్పయోగం తదైవచ దైవజ్ఞం కరణంబైన ఇత్యేత అంగ లక్షణం

🥭దీన్ని బట్టి తిథిని మన బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణబ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞబ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని. అర్ధమవుతోంది. ఈ పంచ బ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు.

🥭పంచాంగ శ్రవణం ఎందుకు?

🥭తిధౌశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కణాత్కార్యసిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమం కాల విత్కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్

🥭మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం. అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు. మహర్షులు. తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో దీర్ఘాయుష్షు, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం, యోగ శ్రవణమూలంగా రోగ నివారణ, కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. కనుకనే ఉగాదినాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు.

🥭ఆధ్యాత్మిక కోణం బంధుమిత్రులతో జీవితాన్ని నిత్య నూతనంగా మలచుకోవడమే పర్వదినాల అంతరార్థం. ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి.

🥭అబ్దాదౌ బంధుసంయుక్తే మంగళస్నానమాచరేత్ వస్త్రం రాభరణై ర్దేహమలంకృత్య తత శ్శుచిః

🥭ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి, విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. అలాగే ఇష్టదేవతలను పూజించి, పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించడం ఆచారం. దానికి ఆరంభదినం ఉగాదే.

  • Related Posts

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!! సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహంచండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త…

    జయహో…..డ్రైవరన్నలు… జయహో…..!

    జయహో…..డ్రైవరన్నలు… జయహో…..! తిరిగిరాని ప్రయాణం కాదు…నీ ప్రయాణానికి తిరుగులేదు. మనోరంజని ప్రతినిధి మార్చి 23 – మన దేశంలో ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న రంగాలలో రవాణారంగం ఒకటి.ఈ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులలో డ్రైవర్ అనే వ్యక్తి పాత్ర చాలా గుర్తించదగినది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?