మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 12 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల కోసం చేపట్టినది. ఇండ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక కిందిస్థాయి నాయకులు ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ నగర్ తాండకు చెందిన 17 మంది తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ, మంగళవారం తహసీల్దార్ మోతీరాం కు ఫిర్యాదు అందజేశారు. అలాగే స్థానిక ఎస్సై అశోక్ కుమార్ కు కూడా ఈ విషయాన్ని వివరించారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్, తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బుధవారం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. నాయకుల చేతివాటం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో లక్ష్మీ నగర్ తాండ వాసులు శాంతించి వెనుదిరిగారు.