ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల సూసైడ్..నులుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి…!!
siddipet Suicide: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది.
దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించిందనే వార్త విన్న కాసేపటికే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం… తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు(40)కు పదేళ్ల కిందట రేణుకతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగారు. ఆరేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి(35)తో నాగరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు లక్ష్మీ, శ్రావణ్ జన్మించారు. నాగరాజు కుటుంబం స్థానికంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసముంటోంది. కూలీపనులు చేసుకుని నాగరాజు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు.
పురుగుమందు తాగి ఆత్మహత్య..
అయితే, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భాగ్య ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తమ ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. భాగ్య అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. అప్పటిదాకా అక్కడే ఉన్న నాగరాజు భార్య మరణవార్త విన్న వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి తన కుటుంబీకులకు ఫోన్ చేసి తాను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కట్ చేశాడు.
కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నాగరాజు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతడు ఉన్న లొకేషన్ను వెళ్లారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలోని చెట్ల మధ్య అచేతనంగా పడి ఉన్న నాగరాజును రాత్రి ఎనిమిది గంటలప్పుడు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసిన తొగుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి నలుగురు పిల్లలు అనాథలు కావడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. కాగా, తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు