

ఆగని బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్..
వాళ్ల ధైర్యమంతా అదేనా
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రెటీలపై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేయడంతో ఒక వారం రోజుల పాటు హడావుడి నడిచింది. బెట్టింగ్ యాప్ల నిర్వహకులపైనా చర్యలు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్ల కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో బెట్టింగ్ యాప్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని, దాదాపు యాప్లన్నీ క్లోజ్ అవుతాయనే ఓ చర్చ బలంగా జరిగింది. కానీ రోజులు గడుస్తున్నా ఫలితం కనిపించడం లేదు.ఐపీఎల్ మ్యాచ్లలో రోజుకు వేల కోట్లలో బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కొత్త యాప్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.చాపకింద నీరులా బెట్టంగ్ యాప్స్ ప్రమోషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సెలబ్రెటీలు ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయగా తాజాగా టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్లను విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రిడక్షన్ పేరుతో బెట్టింగ్ వైపు ఆకర్షస్తున్నారు. ఇటువంటి వారిపై కూడా పోలీసులు ఫోకస్ చేయాలని, క్రికెట్ అనలిస్టుల పేరుతో టెలిగ్రామ్ ఛానల్స్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు చాలమంది.
వాళ్ల ధైర్యం అదేనా
కొందరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా తమ్మదే నమ్మకమైన యాప్ అని, లోకల్ బుకేల దగ్గర ఆడితే పోలీసులు పట్టుకుంటున్నారని, తాము చెబుతున్న యాప్ లీగల్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు. బెట్టింగ్ యాప్లు విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయని, పోలీసులు ఏమి చేయలేరని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. వందలకొద్ది యాప్లు విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ వాటి ప్రమోషన్స్ మాత్రం దేశంలోనే జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కొందరు కొన్ని సంస్థల వద్ద మొబైల్ నెంబర్స్ సేకరించి కాల్స్ సెంటర్స్ నుంచి కాల్ చేస్తూ ఆన్లైన్ గేమింగ్స్ ఆడే అలవాటు ఉందా అంటూ తమ యాప్ను పరిచయం చేస్తున్నారు. తమయాప్లో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువని, ఈ యాప్లో ట్రై చేయండంటూ కాల్ సెంటర్స్ నంచి కాల్స్ చేస్తున్నారు.
విదేశాల నుంచి యాప్స్ను ఆపరేట్ చేస్తుండటంతో ఆ యాప్ అసలు నిర్వహకులు ఎవరనే విషయం బహిర్గతం అయ్యే అవకాశాలు తక్కువ. పోలీసులు సైతం ఈ యాప్స్ను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారనేది అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల వేళ ప్రతిరోజూ కోట్ల రూపాయిలు ఆన్లైన్ బెట్టంగ్ నడుస్తోంది. పోలీసులు తమపై కూడా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రస్తుతం యాప్లలో డబ్బులు నష్టపోతున్న వారు బయటకు రావడం లేదు. యాప్ ప్రమోటర్లతో పాటు నిర్వహకులపై చర్యలు తీసుకుంటేనే ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ను నియంత్రించవచ్చనే చర్చ జరుగుతోంది..