

అర్హులైన దివ్యాంగులకు UDID కార్డుల జారీపై ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- అర్హులైన దివ్యాంగులకు యూనిక్ డిసెబిలిటీ ఐడీ (UDID) కార్డుల జారీని వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో UDID కార్డుల జారీ, దివ్యాంగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 1, 2025 నుండి ప్రభుత్వం ప్రత్యేక డైనమిక్ వెబ్ ఎనేబుల్ సిస్టమ్ను రూపొందించిందని, దీని ద్వారా అర్హులైన దివ్యాంగులకు UDID కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు లేదా కొత్తగా కార్డు కావాలనుకునేవారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తుదారులకు ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షల అనంతరం UDID కార్డులు జారీ చేస్తారని, ఈ కార్డులు 21 రకాల వైకల్యాలు కలిగిన వారందరికీ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని పెంచే దిశగా వేగంగా ముందుకు సాగాలని సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఇతర అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు


